Subsidiary Of KPS Digital Media Network

ఆంధ్రప్రదేశ్ప్రకాశం

పవన్‌ కల్యాణ్ మాస్ వార్నింగ్…వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడం

శక్తి టీవీ, ప్రకాశం :- వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్ట్ పనులను నిర్లక్ష్యంగా వదిలి వేశారని విమర్శించారు. గత పాలకులు రౌడీయిజం, గుండాయిజం చేశారని ధ్వజమెత్తారు. ఇవాళ(శుక్రవారం) ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద రూ.1,290 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని… తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని చెప్పుకొచ్చారు. గొంతులు కోస్తామనే వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు ఎలా వస్తారో చూద్దామని చెప్పారు. వైసీపీకి 151 సీట్లు వచ్చి… తాను రెండు చోట్ల ఓడినప్పుడు కూడా వారిని ఎదిరించానని గుర్తుచేశారు. సినిమా డైలాగులు నిజ జీవితంలో బాగుండవని చెప్పుకొచ్చారు. తలదించుకుని పనిచేస్తున్న వారిని రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. సామాన్యులను బెదిరించడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు పవన్‌ కల్యాణ్.

ప్రకాశం జిల్లా నిర్లక్ష్యానికి గురైంది..

‘నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి ప్రకాశం, నెల్లూరుతో సహా ఐదారు జిల్లాలో తిరిగాను. నెల్లూరులో నాకు ఇంటర్‌మీడియట్ సీట్ ఆనం వివేకానంద రెడ్డి ఇప్పించారు. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. సైమన్ కమిషన్‌కి ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతుడు ప్రకాశం పంతులు. ప్రకాశం జిల్లాలో అపారమైన ఖనిజాలు ఉన్నాయి. జగన్ హయాంలో అభివృద్ధిలో ఈ జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఒంగోలులో రెండు సంవత్సరాలు, కనిగిరిలో ఆరు నెలలు మేము ఉన్నాం. కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్యతో అక్కడి నుంచి వెళ్లిపోయాం. జల్ జీవన్ పనులు మొదటి ప్రయారిటీ ప్రకాశం జిల్లాకి ఇచ్చాం. రౌడీలకు, గుండాలకు భయపడితే రాజకీయాలు చేయలేం. 2029లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. మీ అంతు చూస్తామని అంటున్నారు… అసలు మీరు అధికారంలోకి రావాలి కదా?. మీరు ఎలా వస్తారో మేమూ చూస్తాం. వ్యక్తిగతంగా నాకు వైసీపీ నేతలపై కక్ష లేదు. సగటు మధ్యతరగతి మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తే దాన్ని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చి నేను రెండు చోట్ల ఓడిపోయినా మిమ్మల్ని ఎదుర్కొన్నా. నేను సినిమా నుంచి వచ్చిన వాడినే.. కానీ సినిమా డైలాగులు చెప్పను. గొంతులు కోసేస్తాం… మెడకాయలు కోసేస్తాం అంటే మేమైనా చొక్కా విప్పి చూపిస్తామా. సినిమాలో డైలాగులు చెప్పడానికి నేను కూడా నిజం జీవితంలో ఇబ్బంది పడుతుంటా. వైసీపీ నాయకులు అద్భుతమైన పాలన చేసి ఉంటే 11 సీట్లు వచ్చేవి కాదు’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం..

‘11 సీట్లు వచ్చిన పార్టీగా వైసీపీని గౌరవిస్తాం. చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో తప్పొప్పులు ఉంటే చెప్పండి. ఏమైనా తప్పులు ఉంటే మేము సరిదిద్దుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వంలో రూ.26వేల కోట్లు జల్ జీవన్ మిషన్ పనులకి కేంద్రం ఇస్తామంటే… రూ.4వేల కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ ఖర్చు చేసిన రూ. 4 వేల కోట్లు కూడా వృథా అయ్యాయి. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీకి జల్ జీవన్ మిషన్ పనులకి నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నేను, సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరిపితే జల్ జీవన్ మిషన్ పనులకి మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో తాగునీటి కోసం ఖర్చు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎంపీలు గెలవడంతో కేంద్రానికి అది ఆక్సిజన్ అయ్యింది. అందువల్లే ఏపీకి నిధులు వస్తున్నాయి. దేవదాయ శాఖ భూముల జోలికి వెళ్లకండి’ అని పవన్ కల్యాణ్ సూచించారు.

ఆ భూములపై వారు వాలిపోయారు..

‘దేవదాయ, అటవీ శాఖ, ఖాళీగా కనిపించిన భూములపై జగన్ ప్రభుత్వ పెద్దలు వాలిపోయారు. గత ప్రభుత్వంలో ఆక్రమణకి గురైన భూములపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలిచిన నాయకులు ప్రజలకు ఉపయోగపడాలి. డబ్బులు పెట్టకపోతే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నా. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరికొకరు గౌరవించుకోవాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబుని జైల్లో పెడితే కొంతమంది జనసేన నాయకులు ఏదో మాట్లాడారు. తెలుగుదేశం బలమైన పార్టీ అని జనసేన నాయకులకు చెప్పా. కూటమి అంటే పిడికిలి… ఏ వేలు లేకపోయినా ఏమీ చేయలేం… ఏకలవ్యుడు పరిస్థితి అవుతుంది. 15 సంవత్సరాలు నిలబెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నా పార్టీ, కూటమి సంక్షేమం కంటే ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. అధికారం నుంచి వెళ్లిపోయిన గత పాలకులు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. వారి మాటలకు రెచ్చిపోవద్దు’ అని పవన్ కల్యాణ్ కోరారు.

బాలినేని శ్రీనివాసరెడ్డిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మార్కాపురం సభలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు ఉండవు.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో సహా ఎవరితో గొడవలు లేవని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ప్రశ్నించానని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో తనకు ఎప్పుడూ అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు. బలంగా మాట్లాడే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. సమస్యపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని తెలిపారు. రాజకీయాలు సరిగ్గా ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి బాలినేని అని చెప్పుకొచ్చారు. కక్ష సాధింపులకు వెళ్లకుండా.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తని తెలిపారు. కొత్త కుటుంబసభ్యులు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. రాష్ట్ర క్షేమం, ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలసికట్టుగా పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×